నిత్యం ఏడుస్తోందనే కారణంతో రెండు నెలల శిశువును హతమార్చిన కన్న తల్లి

కాళ్లూ, చేతులూ కట్టేసి.. కట్టెల పొయ్యిలో పడేసి!


హైదరాబాద్‌/దుండిగల్‌: హైదరాబాద్‌ శివార్లలోని బౌరంపేటలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది.
తొలి కాన్పు తర్వాత కొందరు మహిళలకు వచ్చే పోస్ట్‌పార్టుం సైకోసిస్‌కు గురైన ఓ మహిళ కన్న బిడ్డను కర్కశంగా హతమార్చింది. పగలు-రాత్రి తేడా లేకుండా ఏడుస్తోందనే కారణంగా రెండు నెలల చిన్నారి కాళ్లు-చేతులు కట్టేసి, నోట్లో వ్రస్తాలు కుక్కి మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్‌ పోలిశెట్టి సతీష్‌ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ఆదివాసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం సనారెల్లిలో కూలీగా పని చేస్తున్నాడు. ఆ భవనంలోని తాత్కాలిక నిర్మాణంలో భార్య మమత అహిర్వార్‌ (22)తో కలిసి జీవిస్తున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న వీరికి రెండు నెలల చిన్నారి ఉన్నాడు. మమత శారీరకంగానూ బలహీనంగా ఉండటంతోపాటు ఈమెకు ఇది తొలి కాన్పు.

చిన్నారి నిత్యం ఏడుస్తుండటంతో సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ఈమెకు సాధ్యం కావట్లేదు. దీంతో పోస్టుపార్టుం సైకోసిస్‌ బారినపడిన ఆమె చిన్నారి కాళ్లు చేతుల్ని తాడుతో కట్టేసింది. నోట్లో వ్రస్తాలు కుక్కి ఇంట్లో మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. 11.05 గంటలకు ఇంట్లోకి వచ్చిన రాజేంద్ర శిశువును బయటకు తీశాడు. అప్పటికే ఆ చిన్నారి సగం కాలిపోయి మృతిచెందాడు.

భార్యను నిలదీయగా అతడి పైనా అరుస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రవర్తించింది. పోలీసులు మమతను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగా.. ఠాణాలోనూ ఆమె ప్రవర్తన విపరీత ధోరణిలోనే ఉంది. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న ఆమె పోలీసులు ఏ ప్రశ్న అడిగినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరుస్తూ, దూషిస్తూ ఊగిపోతోంది.

తొలి కాన్పు తర్వాత ఆరు నెలలు కీలకం
అనేక మంది మహిళల్లో తొలి కాన్పు తర్వాత పోస్టుపార్టుం డిప్రెషన్‌ లేదా పోస్టుపార్టుం సైకోసిస్‌ బారినపడతారు. డెలివరీ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతుల్యం వల్ల ఇలా జరుగుతుంది. సరైన సమయానికి నిద్ర, ఆహారం లేకపోవడం, ఫ్యామిలీ దూరంగా ఉండటం కూడా వీటికి కారణాలు.

ఈ దశ శిశువు పుట్టిన నాటి నుంచి ఆరు నెలల పాటు ఉంటుంది. సైకోసిస్‌ బారిన వారు విచక్షణ కోల్పోవడం, శిశువుకు హాని చేయడం వంటివి చేస్తారు. బాలింతల్ని ఆరు నెలలపాటు జాగ్రత్తగా గమనిస్తుండాలి. సమయానికి నిద్ర, ఆహారం అందేలా చూడాలి. డిప్రెషన్‌ను గమనిస్తే కౌన్సెలింగ్, వైద్యం చేయించాలి. - డాక్టర్‌ అనిత రాయిరాల, సూపరింటెండెంట్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల.