న్యూఢిల్లీ: చిన్నారులపై దారుణ లైంగిక వేధింపులకు పాల్పడిన కామ పిశాచాలకు ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్‌ ఇంజనీర్‌ రామ్‌ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది.



2010 నుండి 2020 మధ్య కాలంలో దాదాపు 33 మంది మైనర్‌ బాలురపై (3 ఏళ్ల చిన్నారులతో సహా) దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.

అంతేకాకుండా, 2 లక్షలకు పైగా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను దాదాపు 47 దేశాలకు ఇంటర్నెట్‌ ద్వారా చేరవేశారు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యాయమూర్తి ప్రదీప్‌ కుమార్‌ మిశ్రా, నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునాదులనే కదిలించిందని పేర్కొన్నారు. బాధితులైన 33 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది.