Save Punarvika: చిన్నారి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ముందుకొచ్చిన దాతలు



వెల్దుర్తి గ్రామానికి చెందిన 11 నెలల చిన్నారి పునర్వికశ్రీ ప్రాణాల కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటయ్యాయి. చిన్న వయసులోనే ఆ పాపకు అరుదైన జన్యు వ్యాధి అయిన స్పైనల్ ముస్క్యూలర్ ఆట్రోఫీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ వ్యాధి వల్ల శరీర కండరాలు బలహీనపడుతూ, కదలికలు తగ్గిపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ఒక్కసారే ఇచ్చే ప్రత్యేక ఇంజెక్షన్ అవసరం అని వైద్యులు తెలిపారు. ఆ ఇంజెక్షన్ పేరు జోల్జెన్స్మా. దీని ధర సుమారు రూ.16 కోట్లు కావడం కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.


Donors come forward for Rs. 16 crore injection for child

అరుదైన వ్యాధి..

పునర్విక తండ్రి సురేష్ చిన్న షాపులో క్షవర వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ జీవనం గడిపే ఈ కుటుంబానికి ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చడం అసాధ్యం. మొదట కర్నూలులో వైద్యులను సంప్రదించిన వారు, తరువాత హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే ఈ అరుదైన వ్యాధి నిర్ధారణ అయింది. వెన్నెముక కణాలు దెబ్బతినడంతో కండరాల క్షీణత ఏర్పడిందని డాక్టర్లు వివరించారు. చికిత్స ఆలస్యం అయితే పరిస్థితి మరింత విషమించవచ్చని హెచ్చరించారు. దీంతో తల్లిదండ్రులు సహాయం కోసం ప్రజలను వేడుకుంటున్నారు
సోషల్ మీడియాలో 'సేవ్ పునర్విక' ఉద్యమం

పాప పరిస్థితి తెలుసుకున్న యువత, సామాజిక మాధ్యమాల ప్రభావశీలులు 'సేవ్ పునర్విక' పేరుతో నిధుల సేకరణ ప్రారంభించారు. పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యువత సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కొందరు గ్రామాల్లో చిన్నారులు తమ పొదుపు డబ్బును అందించారు. విజయవాడలో ఆటో డ్రైవర్లు కూడా విరాళాలు ఇచ్చారు. సామర్లకోటకు చెందిన ఓ యువకుడు 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి చైతన్యం కల్పించాడు. ప్రభుత్వం, దాతలు ముందుకు వస్తే పాప ప్రాణాలు కాపాడవచ్చని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పునర్వికకు సహాయం చేయాలనుకునేవారు తండ్రి సురేష్‌ను 7799279441 నంబర్‌లో సంప్రదించవచ్చు.