Student gang raped at party | యువతి అత్యాచారం ఆరోపణ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నదని నిందితుడి ఫిర్యాదు



బెంగళూరు : పోష్‌ ఏరియాలోని విల్లాలో జరిగిన పార్టీలో ఇద్దరు వ్యక్తులు తనకు డ్రగ్స్‌ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక యువతి ఆరోపించింది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ యువతి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నదని ఒక నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (Student gang raped at party) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి బెంగళూరులోని కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత ఐదు నెలలుగా ఆ నగరంలో నివసిస్తున్నది.

కాగా, ఆ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 21 ఏళ్ల డిక్సన్ శాండో పరిచయమయ్యాడు. దీంతో వీరిద్దరూ తరచుగా మాట్లాడుకున్నారు. కొన్నిసార్లు కలుసుకున్నారు. ఫిబ్రవరి 14న డిక్సన్ శాండో ఆమెకు ఫోన్‌ చేశాడు. రాత్రి వేళ రెక్స్ విల్లాలో పార్టీకి ఆ యువతిని ఆహ్వానించాడు. దీంతో తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె అక్కడకు వెళ్లింది.

మరోవైపు పార్టీలో 35 ఏళ్ల నిఖిల్‌ను డిక్సన్ తనకు పరిచయం చేసినట్లు ఆ యువతి తెలిపింది. బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చి వారిద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిబ్రవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తనను చంపుతానని వారు బెదిరించినట్లు ఆరోపించింది. ఫిబ్రవరి 17న ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత సోదరుడి సలహా మేరకు ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది.

అయితే నిందితుల్లో ఒక వ్యక్తి ఫిబ్రవరి 21న ఆ యువతిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రాంతీయ వార్తా ఛానెల్‌కు చెందిన ఇమ్రాన్‌తో కలిసి ఆమె డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోతే పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రసారం చేస్తామని వారిద్దరూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి, నిందితుడి ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.