Husband murdered by giving a tour to hired men along with his lover

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి కిరాయి మనుషులకు సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజవర్గం విస్సన్నపేటలో సంచలనం సృష్టించింది.
Husband murdered by giving a tour to hired men along with his lover

విసన్నపేట మండలం బాణావతు తండాకు చెందిన వడిత్య రాజేష్, అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉపాధి కోసం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఒక క్రికెట్ స్టేడియంలో పని చేస్తున్నారు. అయితే స్టేడియం నిర్వహకుడైన చిలక కృష్ణసేనతో పరిచయం కాస్త అలేఖ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయాలని కృష్ణసేన, అలేఖ్యలు పథకం రచించారు.

కడప జిల్లాకు చెందిన పొన్నం రామ్మోహన్, ఇల్లూరు భరత్, వెంకట రమణలతో 3లక్షలకు డీల్ కుదుర్చు కొని, ఆడ్వాన్స్ 2 లక్షలు చెల్లించారు. పథకంలో భాగంగా ఈ నెల 21న రాజేష్ ను పని నిమిత్తం విజయవాడ పిలిపించి, మద్యం తాగించి ఐరన్ రాడ్‌తో కొట్టి, ముఖంపై దిండుతో ఊపిరి అడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం రాజేష్ మృతదేహాన్ని కారులో విస్సన్నపేట మండలం చంద్రుపట్ల ఎన్ఎస్సీ కాలువలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు మృతుడు బంధువుల ఆందోళనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వాహనాన్ని ముట్టడించి ఆందోళనకు దిగడంతో కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు తొలుత ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే మద్యం బాటిల్ హోలోగ్రామ్ నిందితులను పట్టించింది. నున్నలో మద్యం సేవించి 70 కిలోమీటర్ల మేర వాహనం నడిపే అవకాశం లేదని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రాజేష్‌కు మద్యం తాగించి హత్య చేసినట్లు తేల్చారు. రాజేష్ హత్యకు పాల్పడిన నిందితులు కృష్ణసేన, రామ్మోహన్, భరత్, వెంకట రమణలతో పాటు అస్సలు సూత్రధారి భార్య అలేఖ్య అని తేల్చారు. ఆమెను సైతం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలేఖ్య సూచనలతోనే చంపేసినట్లు కృష్ణసేన రామ్మోహన్, భరత్, వెంకట రమణలు పోలీసులకు చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య చివరికి భర్తను హత్య చేసి కటకటాల పాలయింది. ప్రియుడు మోజులో భర్తను హత్య ఒక్కగానొక్క కుమారుడును అనాథను చేసింది.