Vijayawada: Driver abandons bus due to lack of diesel...60 passengers on the road!

విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 60 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరిన 'వర్మ' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, డీజిల్ అయిపోయిందనే కారణంతో డ్రైవర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Vijayawada: Driver abandons bus due to lack of diesel...60 passengers on the road!


ఆదివారం రాత్రి 12:30 గంటలకు బయలుదేరాల్సిన ఈ బస్సు, రెండు గంటల ఆలస్యంగా ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం చేరుకున్నాక, డ్రైవర్ ఒక్కసారిగా బస్సును నిలిపివేశాడు.

డీజిల్ అయిపోయిందని, ప్రయాణికులంతా తమ సొంత మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి డ్రైవర్ అక్కడి నుండి వెళ్లిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైనే ఉండిపోయారు. తెల్లవారుజామున, అందునా నడిరోడ్డుపై బస్సును వదిలేయడంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.