హైదరాబాద్/అమరావతి, ఏప్రిల్ 27: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. ప్రధాన నగరాల్లోని అనేక పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా? లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్త కొరత అయితే కేవలం కొన్ని పట్టణాలు, కొన్ని నిర్దిష్ట బంకులకే ఎందుకు పరిమితమైందనేది మిస్టరీగా మారింది. ఏపీలోని విజయవాడ, గుంటూరులో పెట్రో ఇబ్బందులు దర్శనమిస్తుంటే, ఈ గందరగోళం మధ్య తిరుపతికి చెందిన ఒక పెట్రోల్ బంక్ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
