గ్రీన్ పార్క్ ప్రాంతంలో నివసిస్తున్న 30 ఏళ్ల యువ న్యాయమూర్తి తన నివాసంలోని బాత్రూమ్లో శవమై కనిపించాడు. మృతుడిని ప్రేమ్ కుమార్ శర్మ కుమారుడు అమన్ కుమార్ శర్మ(30)గా గుర్తించారు.
ఈయన ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన పోస్టింగ్ వివరాలను కర్కర్దూమా బార్ అసోసియేషన్ కూడా ధృవీకరించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్కు పిసిఆర్ (PCR) కాల్ అందింది. డిఫెన్స్ కాలనీలో నివసించే మృతుడి బావ శివం ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. తన బావ బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అమన్ శర్మను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. అమన్ కుమార్ శర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎటువంటి కుట్ర కోణాలు కనిపించలేదని, అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారిస్తున్నారు.
