నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
- తుపాకీ తెప్పిస్తామంటూ నమ్మబలికి బళ్లారిలో హత్య
- మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడి
ఆలూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): హొళగుందకు చెందిన జాపుల్లా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాపు చేసిన పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేశారు. కేసు వివరాలను శనివారం సాయంత్రం పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య వెల్లడించారు. హొళగుంద గ్రామానికి చెందిన షేక్షావలి కుమారుడైన జాపుల్లా గత నెల 21వ తేదీ నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొళగుంద పోలీస్స్టేషన్లో గత నెల 24వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా హొళగుందకు చెందిన షారుక్ఖాన్, అక్బర్, అవేజ్, ఉమర్లకు జాఫుల్లాతో పరిచయం ఉంది.
జాఫుల్లాకు నలుగురు భార్యలు, వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. భార్య తరపున బంధువుల నుంచి తనకు ప్రమాదం ఉందని, తుపాకీ కావాలని వారికి రూ.45 వేలు ఇచ్చాడు. వారు తమకు బీహార్లో పరిచయాలు ఉన్నాయని, అక్కడి నుంచి తెప్పిస్తామని జాఫుల్లాను నమ్మించారు. గన్ తెప్పించకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే చంపేస్తానని జాఫుల్లా హెచ్చరించడంతో చేసేదేమి లేక బళ్లారికి చెందిన కొందరితో కలిసి జాఫుల్లాను హత్య చేయాలని పథకం రచించారు.
గన్ తెప్పించామని, బళ్లారికి వచ్చి తీసుకోవాలని చెప్పడంతో బళ్లారి బైపాస్లో ఉన్న మహావీర్ దాబా దగ్గరకు వెళ్లగా 8 మంది కలిసి ఆయన కళ్లలోకి పెప్పర్ స్ర్పే కొట్టి వైరుతో గొంతును గట్టిగా బిగించి హత్య చేసి పారిపోయినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం హొళగుంద నుంచి ఆదోని వైపు వెళ్లే అక్బర్, ఉమర్, అవేజ్లను అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. అలాగే షారుక్ఖాన్ను కూడా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి కరెంట్ వైర్, ఓ మోటార్ సైకిల్, పెప్పర్ స్ర్పేను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్, ఆలూరు ఎస్ఐ మన్మధవిజయ్, సిబ్బంది ఉన్నారు.
