Auto overturns.. Six people are in critical condition!

Exdent

కృష్ణా జిల్లా: నాగాయలంక సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో గణపేశ్వరం గ్రామానికి చెందిన 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మొక్కజొన్న పనుల నిమిత్తం బాపట్ల జిల్లా గొరికపూడి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదుగురికి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరో ప్రమాదంలో నందిగామ రూరల్‌ మండలంలోని ఐతవరం గ్రామ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. కంచికచర్లకు చెందిన లక్ష్మీనారాయణ (50) బుధవారం కంచికచర్ల నుంచి ద్విచక్ర వాహనంపై నందిగామ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐతవరం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి వెనుకగా వస్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలు కావటంతో టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నందిగామలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.