అప్పుల బాధలతో రోజుకు సగటున 48మంది రైతుల ఆత్మహత్య
ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఇల్లెందు, మే 12 (ఆంధ్రజ్యోతి): మోదీ 2029లో మళ్లీ ప్రధాని అయితే దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం అంతమవుతాయని రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.
ప్రజాస్వామిక వ్యక్తులు, సంస్థలు సంఘటితమై దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ ప్రథమ మహాసభలను మంగళవారం శోభనాద్రీశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రైతు సంక్షేమాన్ని వదిలేసి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలనే కాపాడుతోందని విమర్శించారు. అప్పుల బాధలతో రోజుకు సగటున 48మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి దేశంలో నెలకొందన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది గిరిజనులను చంపేసి మావోయిస్టులు అంతమైనట్టు అమిత్షా ప్రకటించారని, కానీ వివక్ష, దోపిడీ ఉన్నంతవరకు మావోయిజం పోదని ఆయన పేర్కొన్నారు. అయితే, తుపాకుల ద్వారా వ్యవస్థ మారదని, ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడాలని అభిప్రాయపడ్డారు. ఏఐయూకేఎస్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో, మాజీ ఎమ్మెల్యే, ఏఐయూకేఎస్ గౌరవాఽధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య, సీపీఐఎంఎల్ ప్రజాపంథా కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రాంచందర్, రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు తదితరులు పాల్గొన్నారు.
