బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని నేరస్థుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏ తప్పూ చేయలేదని తన కుమారుడు చెబుతున్నాడని అన్నారు. అయితే తన కుమారుడ్ని తాను సమర్థించడం లేదని తెలిపారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తన కుమారుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. " నా కుమారుడిపై దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోంది. డిప్రెషన్ లోకి పోతుంది. నేను ఎప్పుడూ బాధపడను. నా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను" అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేసిన కేసులో బండి భగీరథ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసుల్లో పేర్కొన్నారు. పేట్ బషీరాబాద్ పీఎస్ లో విచారణకు హాజరు కావాలని తెలిపారు. కరీంనగర్ లోని ఇంటికెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ కేసు విచారణ నిలిపివేయాలని ఇప్పటికే హైకోర్టులో భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14 న వెకేషన్ బెంచ్ లో పిటిషన్ విచారణకు రానుంది.
మరోవైపు భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డీసీపీ రితిరాజ్ సమక్షంలో బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. స్టేట్ మెంట్ ప్రకారం కొత్త సెక్షన్లను జత చేశారు. ఇక భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈనెల 8న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ మైనర్ బాలిక, ఆమె తల్లి నగదు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బండి భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా ఈ కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా.. పారదర్శకంగా విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
