తాను పెట్టిన నిప్పే మృత్యువై...
మక్క కర్రలకు పెట్టిన నిప్పు చెలరేగి వరి పంట వైపు వెళ్లిన వైనం
ఆర్పే క్రమంలో మంటలంటుకుని రైతు మృతి.. నిర్మల్ జిల్లాలో ఘటన
లక్ష్మణచాంద, మే 12 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
పొలంలో వృథాగా పడి ఉన్న మక్క కర్రలకు నిప్పు పెట్టిన ఓ రైతు.. ప్రమాదవసాత్తు ఆ మంటల్లోనే కాలి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద కనకాపూర్ గ్రామానికి చెందిన మంద గంగన్న(56) అనే రైతు మంగళవారం ఉదయం తన చేనులో వృథాగా పడి ఉన్న మక్క కర్రలకు నిప్పు పెట్టాడు.
ఆ మంటలు చెలరేగి పక్కనే ఉన్న వరి పంటల వైపు మళ్లాయి. అయితే, వరి పంటకు ఎక్కడ నిప్పు అంటుకుంటుందోనన్న ఆందోళనతో గంగన్న చెట్ల కొమ్మల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో గంగన్న శరీరానికి నిప్పు అంటుకోగా.. ఆయన అక్కడికక్కడే మరణించాడు. గంగన్నకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
